టీమిండియా జట్టు అద్భుత ప్రదర్శనకు పాకిస్తాన్ జట్టు చేతులెత్తేసింది. అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థితో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బౌలింగ్లో విజృంభించి 191 పరుగులకే పాకిస్తాన్ని ఆలౌట్చేసిన టీమిండియా బ్యాటింగ్లోనూ దుమ్మురేపింది. కేవలం 30.3 ఓవర్లలోనే 192 పరుగుల లక్ష్యాన్ని లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచకప్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.
కెప్టెన్ రోహిత్శర్మ క్రీజ్లో చెలరేగిపోయాడు. ఆరు ఫోర్స్ ఆరు సిక్సర్లతో స్టేడియంని హోరెత్తించాడు. కేవలం 63బంతుల్లో 86 పరుగులు చేసి అందరినీ అలరించాడు. శ్రేయస్ అయ్యర్ (53) హాఫ్ సెంచరీ చేస్తే భారత్ విజయంలో కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ తమ పాత్ర పోషించారు. కోహ్లీ 16 పరుగులకే వెనుదిరిగాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న భారత్ జట్టు అక్టోబర్ 19న బంగ్లాదేశ్తో తలపడుతుంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 200 పరుగులు కూడా చేయలేకపోయింది. పాక్ జట్టులో బాబర్ అజామ్(50) హాఫ్ సెంచరీ చేస్తే మహమ్మద్ రిజ్వాన్ (49), ఇమామ్ ఉల్ హక్ (36)ల బ్యాటింగ్తో పాకిస్తాన్ ఆ మాత్రం పరుగులన్నా చేయగలిగింది. ఓ దశలో 29.3 ఓవర్లకు 154/2 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచిన పాకిస్తాన్ వికెట్లు తర్వాత టపటపా పడ్డాయి. 50 ఓవర్లు ఆడలేక 42.5 ఓవర్లకే ఆ జట్టు కుప్పకూలింది. కేవలం 37 పరుగుల తేడాలో చివరి ఎనిమిది వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు. బుమ్రా, హార్ధిక్, జడేజా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పంచుకున్నారు.