అప్పుడప్పుడు పురుషపుంగవులు గొంతెత్తుతుంటారు. మాకు ఎదురయ్యే వేధింపుల సంగతేంటని ఎలుగెత్తి చాటాలనుకుంటారు. కానీ ఆ ఆర్తనాదం ఎవరికీ పట్టదు. ఎవరి చెవులకూ ఎక్కదు. ఎందుకంటే చట్టాల దృష్టిలో మగవాళ్లే బాధిస్తుంటారు. వేధిస్తుంటారు. మహిళలు బాధితులవుతుంటారు. అందుకే అప్పుడప్పుడూ ఎవడన్నామగాడు కన్నీళ్లు పెట్టుకున్నా, కష్టాలుచెప్పుకున్నా దానికి పెద్దగా విలువఉండదు.
సాదాసీదా మనుషుల సంగతి పక్కనపెడదాం. క్రీజ్లో దిగితే బ్యాట్తో బాల్ని ఎడాపెడా బాదేసే ప్రముఖ క్రికెటర్ కూడా గృహహింస బాధితుడే. మగజాతికి పెద్ద ఊరటనిచ్చే విషయమేంటంటే ఆ క్రికెటర్ భార్యా బాధితుడని న్యాయస్థానం గుర్తించడం. టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్కి ఢిల్లీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అతని భార్య ఆయేషా ముఖర్జీ మానసిక క్రూరత్వానికి పాల్పడుతోందని నిర్ధారించిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.
ఒకప్పుడు కిక్ బాక్సర్ అయిన ఆయేషా ముఖర్జీ శిఖర్ధావన్ జీవితంలోకి రావడానికి కారణం హర్భజన్సింగ్. అతనే ఆమెని తోటి క్రికెటర్కి పరిచయం చేశాడు. వయస్సులో తనకంటే పన్నెండేళ్లు పెద్దదయిన ఆయేషాతో 2009లో ధావన్కి ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పటికే పెళ్లయిన ఆయేషాకి ఇద్దరు ఆడపిల్లలున్నా శిఖర్ధావన్ తన జీవితంలోకి ఆహ్వానించాడు. 2012లో ఇద్దరికీ పెళ్లి జరిగింది. 2014లో వీరికి కొడుకు పుట్టాడు. పెళ్లికిముందే ధావన్తో కలిసి ఇండియాలోనే ఉంటానన్న ఆయేషా తర్వాత మాటమార్చింది. కొడుకుతో ఆస్ట్రేలియాలో ఉంటోంది.
శిఖర్ధావన్కి దూరంగా ఉండటమే కాదు.. అతన్ని ఆయేషా ముఖర్జీ మానసికంగా ఎంతో వేధించింది. ఆస్ట్రేలియాలో ఉన్న ధావన్ ఆస్తుల్లో వాటాకోసం ఒత్తిడి తెచ్చింది. శిఖర్ధావన్ పరువు తీసేలా బీసీసీఐ పెద్దలకు, ఐపీఎల్ టీం మేనేజ్మెంట్తో పాటు శిఖర్ధావన్ తోటి క్రికెటర్లకి మెసేజ్లు పంపింది. మొదటిభర్త సంతానం ఫీజులు, ఖర్చులన్నీ ధావన్తోనే పెట్టించింది. దీంతో 2020నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. శిఖర్ధావన్ విడాకులకోసం పెట్టుకున్న కారణాలతో ఏకీభవించిన కోర్టు అతన్ని సంసారిక జీవితం నుంచి బంధ విముక్తుడిని చేసింది.