శకునం చెప్పే బల్లి కుడితిలో పడితే ఎలాఉంటుంది. సుద్దపూసలా నీతులు చెప్పే ప్రకాష్రాజ్కూడా తెలిసో తెలియకో ఆ బురదలో అడుగేసిన బాపతే. సామాజిక బాధ్యత మరిచిన సెలబ్రిటీలను స్టేషన్కి పిలిచి విచారిస్తుంటే అవునవును అది తప్పేనంటూ ఇప్పుడు బురదకడుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రకాష్రాజ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది బెట్టింగ్ యాప్ల వ్యవహారం. వాటికి ప్రచారకర్తలుగా ఉన్న సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెట్టి ఎంక్వయిరీకి పిలుస్తున్నారు.
పాతికేళ్లయిందికదాని మర్డర్ చేసినోడు దొరికితే వదిలిపెట్టరు. ఎప్పుడో ఎవరి మెడలోనే లాగేసిన చైన్ని ఎక్కడో అమ్మేసుకుని చాలా కాలమైందని క్షమించేయరు. ఎప్పటికైనా తప్పు తప్పే. 2016లో డబ్బుకి కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్ చేశాడు ప్రకాష్రాజ్ కూడా. ఆ తర్వాత ఎప్పుడూ గేమింగ్ యాప్లకు ప్రచారకర్తగా చేయలేదంటున్నాడు. గేమింగ్ యాప్స్ ఒక వ్యసనం. యువత దీనికి దూరంగా ఉండాలని ఇప్పుడు జాతికి సందేశమిస్తున్నాడీ పెద్దమనిషి. పోలీసులు సీరియస్గా తీసుకోవటంతో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో కంగారు మొదలైంది.
బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన లిస్ట్లో నిన్నటిదాకా 11. ఇప్పుడా లిస్ట్ 25కు చేరింది. సెలబ్రిటీ హోదా ఉందని చెత్తాచెదారాన్నంతా ప్రమోట్ చేసి సమాజం మీద రుద్దితే ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో సినీతారలకు తెలిసొస్తోంది. బెట్టింగ్ యవ్వారాల్లో మునిగి ఇప్పుడు తప్పయిందని లెంపలేసుకుంటే క్షమించే పరిస్థితే ఉండదని తెలంగాణ పోలీసులు గట్టిగానే మెస్సేజ్ పంపారు టాలీవుడ్కు. మొన్నటిదాకా ఛోటామోటా తలకాయల్నే పట్టుకున్న పోలీసులు..ఈసారి టాలీవుడ్లోని ఉద్దండ పిండాలనే పట్టుకున్నారు.
టాలీవుడ్ ప్రముఖులు 25మందిపై కేసు ఫైల్ చేశారు. ఏ1 నుంచి ఏ6వరకు లిస్ట్ చూస్తే దగ్గుబాటి రానా, ప్రకాష్రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణిత, నిధి అగర్వాల్ బుక్ అయ్యారు. వీరితో పాటు హీరోయిన్ అనన్య నాగెళ్ల, యాంకర్లు శ్రీముఖి, వర్షిణి, సిరి హన్మంత్, వంశీ సౌందర్య రాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని కూడా బుక్ అయ్యారు. ఓ పక్క పోలీసులు పిలిచి ఎంక్వయిరీ చేస్తుంటే బెట్టింగ్ స్కామ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఫోకస్ పెట్టింది. నిషేధిత యాప్ల ద్వారా భారీగా డబ్బు నకిలీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయిందా అనే విషయంపై ఈడీ ఫోకస్ పెట్టింది.
లేదు లేదు మూడే చేశానన్న నంగనాచి విష్ణుప్రియ మూడు గంటల ఎంక్వయిరీ తర్వాత మొత్తం 15బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు ఒప్పుకుంది. ఒక్కో వీడియోకు 90వేల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో అంగీకరించింది. విష్ణుప్రియ, టేస్టీ తేజకు పోలీసులు ఇంతకుముందే నోటీసులివ్వగా.. లేటెస్ట్గా శ్యామల, రీతు చౌదరి, అజయ్ సన్నీ, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్లకు నోటీసులిచ్చారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఇచ్చిన ఆర్డర్తో యాంకర్ శ్యామల ప్రస్తుతానికి సేఫ్.
బెట్టింగ్ యాప్స్పై టాలీవుడ్ ఫిలిం చాంబర్ సీరియస్ అయింది. ప్రజలిచ్చిన సెలబ్రిటీ హోదాను ఇలాంటి ప్రమోషన్లతో దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. టాలీవుడ్ ప్రముఖులు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్పై మండిపడుతున్నారు. అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. విజయ్దేవరకొండ, ప్రకాష్రాజ్ లాంటి వారు స్కిల్డ్ బేస్డ్ గేమ్స్కు , చట్టప్రకారం అనుమతి ఉన్న యాప్స్కు మాత్రమే ప్రమోట్ చేశారని వారి సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు సోకాల్డ్ సెలబ్రిటీలు. మరి ఈ హడావుడి కేసుల వరకేనా..శిక్షలదాకా వెళ్తుందో చూడాలి.