ఫ్రీ స్కీములకోసం పేదోళ్ల అవతారం!

rationa-cards-e1742624114467.jpg

కారున్నోడు, అయిదంతస్తుల ఇల్లున్నోడు కూడా రికార్డుల్లో పేదోడో. ఫ్రీఫ్రీ అంటూ ప్రభుత్వాలిచ్చే పథకాలు పొందాలంటే తెల్లకార్డు ఉండాలిగా. తెలుగురాష్ట్రాల్లో వాటికోసమే అన్నీ ఉన్నా పేదలమని చెప్పుకునే కక్కుర్తిగాళ్లు కోకొల్లలు. ఓపక్క ఉచితాలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. అలవిమాలిన హామీలిచ్చేసి కొన్ని ప్రభుత్వాలు జేబులు తడుముకుంటున్నాయి. కేంద్రంకూడా ఇలాంటి ఉచిత పథకాలకు తాము వ్యతిరేకమంటోంది.

రేషన్‌కార్డుల పేరుతో జరుగుతున్న ప్రహసనంపై అత్యున్నత న్యాయస్థానం కూడా స్పందించింది. పేదలకు న్యాయం పేరుతో చాలా రాష్ట్రాలు అనర్హులకు రేషన్‌కార్డులు ఇస్తున్నాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనర్హుల దగ్గర ఉన్న రేషన్‌కార్డులను రద్దు చేయాలని ఆదేశించింది. మరోవైపు ఉచితాల పేరుతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పథకంతో పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఉచితాలపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది.

సంక్షేమ పథకాలు, పెన్షన్ల విషయంలో దేశమంతా ఒకే విధానం ఉండాలన్నారు రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలన్నారు. వన్‌నేషన్‌ వన్‌ ఎలక్షన్‌అంటే చాలామందికి అభ్యంతరాలున్నాయి. కానీ జగదీప్‌ సలహా బానే ఉంది. సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉండడంతో అసలైన పేదలకు అన్యాయం జరుగుతోంది. పేదల ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడటంతో రాష్ట్రాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చింది.

పేదలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకే రాష్ట్రాలు రేషన్ కార్డుల లెక్కలు చెబుతున్నాయని.. వాస్తవానికి పేదలకు రేషన్ ఫలాలు అందడం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. తలసరి ఆదాయం పెరుగుతోందని డప్పాలు కొట్టుకుంటున్నాయి కొన్ని రాష్ట్రాలు. అదే సమయంలో బీపీఎల్ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నాయి. ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే మెజార్టీ ప్రజలుంటే తలసారి ఆదాయం ఎలా పెరుగుతోందో ఏమో! సుప్రీం కూడా ఇదే పాయింట్‌ లేవనెత్తుతోంది. జనానికి బిస్కెట్లు వేయడానికి అలవాటుపడ్డ పాలకులకు తామెంత తప్పుచేస్తున్నామో అర్ధమవుతోందా?

Share this post

submit to reddit
scroll to top