చరిత్రను తవ్వితీసి మనం సమాధైపోదామా!

ourangajeb-toomb.jpg

చరిత్ర చింపితే చిరిగేది కాదు..అలాగని అందులో ఉన్నదంతా నిజం కాదు. ఏదివాస్తవం..ఏది కల్పితం..ఏది వక్రీకరణం…దీని చుట్టూరా దశాబ్దాలుగా చర్చ సాగుతూనే ఉంది. రాజకీయంగా రచ్చ పరుగులు పెడుతూనే ఉంది. ఒక‌వైపు ప్రపంచం ఏఐ అంటూ ప‌రుగులు తీస్తూ ఉంటే.. మన రాజకీయం మాత్రం ఇంకా మధ్యయుగంలోనే కొట్టుమిట్టాడుతోంది.

హిందీ మూవీ ఛావా ఔరంగజేబు ఎంత నీచుడో కళ్లకు కట్టింది. దేశం కోసం పోరాడిన ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీని హింసించిన తీరు కన్నీళ్లు పెట్టించింది. ఔరంగజేబు ఇంత క్రూరుడా అన్న చర్చతో కోట్లమంది రక్తం మరిగిపోయింది. ఛావా సినిమా రాజకీయ నాయకులకైతే పూన‌కాలు తెప్పించింది. దీంతో ఔరంగజేబు సమాధిని తవ్వితీయాలంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధిపై రాజకీయ వివాదం మరింత ముదిరింది. శంభాజీనగర్‌లో ఉన్న ఔరంగజేబు సమాధి చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి.

ఔరంగజేబు టూంబ్‌ నిర్వహణ కోసం పురావస్తుశాఖకు కేంద్రం నిధులు ఇస్తోంది. ఈ నిధులను ఆపేయాలని బీజేపీ నేతల నుంచి డిమాండ్ మొదలైంది. ఇక పుణెలో జరిగిన ఒక సభలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. ఔరంగజేబు పోస్టర్‌ని చింపేశారు. ఔరంగజేబు సమాధిని బుల్డోజర్‌తో ధ్వంసం చేయాలని రాజాసింగ్‌ పిలుపునిచ్చారు. ఇక సమాధిని కూల్చాలంటూ వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్‌ ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. బాబ్రీమసీదులాగే ఔరంగజేబు సమాధిని కూడా కూల్చేస్తామని హెచ్చరిస్తున్నారు.

హిందూ సంఘాల ఆగ్రహంతో ఉద్రిక్తతలు పెరగటంతో పోలీసులు ఔరంగజేబు సమాధి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫోటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించారు. ఒకవైపు ఔరంగజేబును క్రూర పాలకుడిగా చిత్రీకరిస్తూ ఆయన సమాధిని తొలగించాలని కోరుతుండగా, మరోవైపు చరిత్రను గౌరవించాలని, దాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని మరికొందరి వాదన. ఈ ఉద్రిక్తతల నడుమ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కీలక ప్రకటన చేశారు. సమాధిని కూల్చివేయడం కుదరదంటూనే ఇక నుంచి అక్కడ ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు జరగవని ప్రకటించారు.

ఔరంగజేబు సమాధిని ఏఎస్‌ఐ 50 ఏళ్ల కిందటే సురక్షిత స్థలంగా ప్రకటించింది. దీంతో సమాధిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాలపై ఉంది. కానీ సమాధి దగ్గర ఎలాంటి వైభవోపేతమైన కార్యక్రమాలకు ఇకపై అనుమతించరు. ఛావా చిత్రం తర్వాత మొఘల్ రాజు ఔరంగజేబు గురించి దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. సినిమాలో ఔరంగజేబును చాలా క్రూరమైన పాలకుడిగా చూపించారు. కానీ ఔరంగజేబు గొప్పపాలకుడంటూ మహారాష్ట్ర ఎస్పీ నాయకుడు అబూ అజ్మీ చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసింది.

మరణించిన సమయంలో ఔరంగజేబు మహారాష్ట్రలోనే ఉన్నాడు. ఔరంగాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుల్దాబాద్‌లో ఔరంగజేబును ఖననం చేశారు. మొదట ఆయన సమాధి సాధారణంగానే ఉండేది. మట్టితో, కర్రలతోనే నిర్మించారు. అయితే 1921లో హైదరాబాద్ చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలరాతితో ఔరంగ జేబు సమాధిని మరింత సుందరంగా తీర్చిదిద్దాడు.

మొఘల్ చక్రవర్తి సమాధి కావడంతో అదిప్పుడు జాతీయ వారసత్వ సంపదగా మారింది. అటువంటి పరిస్థితిలో చారిత్రక వారసత్వానికి దేశంలో ఉన్న చట్టాల ప్రకారం వీలుకాదన్న చర్చా జరుగుతోంది. ప్రస్తుతం శంభాజీనగర్‌లోని ఔరంగజేబు సమాధి దగ్గర భద్రతను పెంచింది ప్రభుత్వం. సమాధి చుట్టూ భద్రతను పెంచేలోపే నాగ్‌పూర్‌లో మంటలు అంటుకున్నాయి. శతాబ్దాల నాటి రాజు మంచీచెడ్డా గురించి కలిసిమెలిసి బతకాల్సినోళ్లు కొట్లాడుకుంటున్నారు. కొన్నిచోట్ల కర్ఫ్యూదాకా తెచ్చారు.

Share this post

submit to reddit
scroll to top