ఎక్కడ ఉగ్రదాడి జరిగినా హైదరాబాద్లో మూలాలు. శాంతియుత వాతావరణంతో ఉన్న హైదరాబాద్ను ఉగ్రనీడలు కలవరపెడుతున్నాయి. ఎక్కడ ఉగ్రదాడి జరిగినా ఆ లింక్ హైదరాబాద్లోనే బయటపడుతోంది. యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసిన ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ టెర్రర్ అటాక్తోనూ హైదరాబాద్ పేరే వినిపించింది. బీచ్ దగ్గర జరిగిన నరమేధానికి ప్రధాన సూత్రధారి అయిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నుంచి వెళ్లినవాడేనని ఆస్ట్రేలియా అధికారులు ధృవీకరించడంతో భారత నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
తండ్రి ఆర్మీలో పనిచేశారు. సోదరుడు డాక్టర్. ఒకళ్లు దేశాన్ని కాపాడేవాళ్లయితే, మరొకళ్లు రోగుల ప్రాణాన్ని కాపాడేవాళ్లు. అలాంటి కుటుంబంలో పుట్టిన సాజిద్ అక్రమ్…ప్రాణాలు తీసే టెర్రరిస్టుగా మారాడు. తాను కొడుకుని టెర్రరిస్టుగా మార్చాడో, కొడుకు ప్రేరణతో తానే ఉగ్రవాదిగా మారిపోయాడోగానీ తండ్రీకొడుకులు తుపాకులతో తెగబడ్డారు. హైదరాబాద్ టోలిచౌకి నుంచి ఎప్పుడో 1998లో ఆస్ట్రేలియాకు వెళ్లిన సాజిద్ అక్రమ్ ఉగ్రవాది అవతారం ఎత్తాడు.పోలీసుల కాల్పుల్లో సాజిద్ హతమయ్యాడు. ప్రాణాలతో దొరికిన కొడుకు నవీద్ ఆస్పత్రిలో ఉన్నాడు.
ఆస్ట్రేలియాలో తీగ లాగితే.. సాజిద్ మూలాలు మన హైదరాబాద్లోని టోలీచౌకీలో కదిలాయి. సాజిద్ పుట్టుపూర్వోత్తరాలు విచారిస్తే, అతడి తండ్రి విదేశాల్లో డిఫెన్స్ సర్వీస్లో పనిచేశారు. సాజిద్ సోదరుడు షాజిద్ పాతబస్తీలో డాక్టర్గా పనిచేస్తున్నారు. ఇలాంటి కుటుంబంలో పుట్టిన సాజిద్, తాను టెర్రరిస్టుగా మారడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ తీవ్రవాదంవైపు మళ్లడానికి భారత్ లేదా తెలంగాణలోని ఏ స్థానిక ప్రభావాలు కారణం కాదని ప్రాథమికంగా తేలినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. 1998లో భారత్ విడిచేవరకు సాజిద్ అక్రమ్పై తెలంగాణ పోలీసుల దగ్గర ఎలాంటి నెగిటివ్ రికార్డులు లేవని స్పష్టం చేశారు.
1998లో ఆస్ట్రేలియా వెళ్లాక యూరోపియన్ మహిళను పెళ్లాడి అక్కడే సెటిలయ్యాడు సాజిద్. 27 ఏళ్లలో ఆరుసార్లు హైదరాబాద్కొచ్చాడు. చివరిసారిగా 2022లో హైదరాబాద్కొచ్చి ఫ్యామిలీతో ఆస్తి పంపకాల వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాడు. సాజిద్ దగ్గర భారత పాస్పోర్ట్ ఉండటంతో.. అతని ఉగ్ర కార్యకలాపాలకు దేశంలో ఇంకెక్కడన్నా లింకులున్నాయా అని ఆరాతీస్తున్నారు. ఈ విచారణలో కేంద్ర సంస్థలు, ఇతర భద్రతా ఏజెన్సీలతో పూర్తిస్థాయిలో సహకరిస్తామంటున్నారు తెలంగాణ పోలీసులు.





