స‌ల్మాన్ టూ బాలసాధు.. బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్స్‌

abhinavarora.jpg

స‌ల్మాన్‌ఖాన్‌కి వార్నింగ్‌. స‌ల్మాన్ సిద్ధిఖీ మ‌ర్డ‌ర్‌. దేశ‌మంతా ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ గురించేచ‌ర్చ‌. కెనెడా నుంచి ఆప‌రేష‌న్స్‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ డెన్‌గా మారిన బిష్ణోయ్ ముఠా.. టార్గెట్స్ అంద‌రినీ అయోమయంలో ప‌డేస్తున్నాయి. ఆగ్యాంగ్ వార్నింగ్స్‌తో రౌడీయిజంలో పీహెచ్‌డీ చేసిన ప‌ప్పుయాద‌వ్ లాంటోడే భ‌యంతో వ‌ణికిపోతున్నాడు. ఇప్పుడు విచిత్రంగా ఓ పిల్లాడ్ని కూడా హిట్ లిస్ట్‌లో చేర్చేసింది బిష్ణోయ్ గ్యాంగ్‌. ఆ టార్గెట్ వ‌య‌సెంతో తెలుసా.. జ‌స్ట్ ప‌దేళ్లు. అవును ప‌దేళ్ల పిల్లాడే. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హిట్‌లిస్ట్‌లో పదేళ్ల బాలసాధు అభినవ్‌ అరోరా చేరడం తీవ్ర కలకలం రేపింది. బెదిరింపుల‌తో తమకు రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులకు అభినవ్‌ కుటుంబం ఫిర్యాదు చేసింది.

వాస్త‌వానికి గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నాడు. అయినా అత‌ని గ్యాంగ్ అరాచ‌కాలు ఆగ‌డం లేదు. రోజుకో సెలబ్రిటీని చంపేస్తానని బెదిరించి ఈ గ్యాంగ్‌ వార్తల్లో ఉంటోంది. స‌ల్మాన్‌ఖాన్‌నో, రాజ‌కీయ నాయ‌కుల‌నో బెదిరించారంటే దానికో కార‌ణం ఉంటుంది. కానీ బాల‌సాధు లాంటి చిన్నారులను కూడా గ్యాంగ్‌ వదలడం లేదు. బాలసాధు అభినవ్‌ అరోరా తన ప్రవచనాలతో ఎంతో మందిని చిన్న వయస్సు లోనే ఆకట్టుకుంటున్నాడు.
అభినవ్‌ అరోరాకు ప్రముఖ సాధువుల నుంచి ప్రశంసలు లభించాయి. సోషల్‌ మీడియాలో కూడా ఆయనకు 10 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. తన కుమారుడు భక్తి ప్ర‌చారం మాత్రమే చేస్తున్నాడని, అదెలా తప్పు అవుతుందని ప్రశ్నిస్తోంది అభినవ్‌ తల్లి.

బీహార్‌లోని పూర్నియా ఎంపీ పప్పూ యాదవ్‌ను కూడా చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్‌ తాజాగా హెచ్చరికలు చేసింది. సల్మాన్‌తో పాటు బాబా సిద్దిఖీ కుటుంబసభ్యులను పప్పూ యాదవ్‌ కలవడంపై బిష్ణోయ్‌ గ్యాంగ్‌ భగ్గుమంది. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను , కేంద్ర హోంశాఖని అభ్యర్ధించాడు పప్పూ యాదవ్‌. పప్పు యాదవ్‌ ఏడుసార్లు వేర్వేరు పార్టీల‌నుంచి ఎంపీగా గెలిచాడు. సుమో వ‌స్తాదులా ఉండే ప‌ప్పుయాద‌వ్ అంటే బీహార్‌లో చాలామంది డాన్‌లకు హడల్‌.. కాని విచిత్రంగా అలాంటి నాయ‌కుడికే బిష్ణోయ్‌ గ్యాంగ్ నిద్ర‌లేకుండా చేస్తోంది. పతమకు వ్యతిరేకంగా కామెంట్స్‌ చేస్తే బాబా సిద్దిఖీకి పట్టిన గతే పడుతుందని పప్పూ యాదవ్‌ని ఫోన్‌లో హెచ్చరించింది లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌. సల్మాన్‌ఖాన్‌కు మద్దతు ఇవ్వొద్ద‌ని హెచ్చ‌రించింది.

బీహార్‌లో పప్పూ యాదవ్‌కు చెందిన నాలుగు ఇళ్లపై రెక్కీ చేసినట్టు కూడా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యుడు ప్రకటించాడు. బాబా సిద్దిఖీ తనయుడు జిషాన్‌ సిద్దిఖీని పప్పూ యాదవ్‌ పరామర్శించడం లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ కోపానికి కార‌ణం. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని , వెంటనే రక్షణ పెంచాలని పోలీసులను , కేంద్ర హోంశాఖను కోరారు పప్పూ యాదవ్‌. చూస్తుంటే బిష్ణోయ్ గ్యాంగ్ ఆగ‌డాలు ఇప్ప‌ట్లో ఆగేలా క‌నిపించ‌డం లేదు.

Share this post

submit to reddit
scroll to top