పెట్రోల్, డీజిల్.. ఆ తర్వాత సీఎన్జీ. ఇప్పుడు న్యూజెన్ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేశాయి. ఈవీ సీజన్ కూడా పీక్స్లో నడుస్తోంది. వాట్నెక్ట్స్ అంటే గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రిక్. ఆరోజు కూడా ఎంతో దూరంలో లేదని హింట్ ఇస్తోంది మోదీ సర్కార్.
టొయోటో మిరాయ్.. ఆటోమొబైల్ సెక్టార్ని ఉరకలెత్తిస్తున్న నయా సౌండ్ ఇది. ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ బాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కార్. ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్ రోడ్లపై రయ్రయ్న రౌండ్లు కొట్టేస్తోంది. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ స్లోగన్లో ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది టొయోటో మిరాయ్.
దేశంలో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ-NISEతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ. డీల్ క్లోజైన తర్వాత పార్లమెంట్ ఆవరణలో మిరాయ్ కారుతో ఫీల్డ్ ట్రయల్ వేశారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి. జర్నీ చాలా స్మూత్గా, సైలెంట్గా , కంఫర్టబుల్గా ఉంది అంటూ మిరాయ్ ఎక్స్పీరియన్స్ని మంత్రి సోషల్మీడియాలో షేర్ చేశారు.
మన దేశంలో రోడ్లు, వాతావరణ పరిస్థితులపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత, మార్పులు-చేర్పులు చేసి హైడ్రోజన్ కార్ని అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో ఫ్యూయల్ ఛాంబర్లో ప్రత్యేక రసాయనిక ప్రక్రియతో పవర్ జనరేట్ అవుతుంది. ఆ పవర్తోనే వెహికల్ నడుస్తుంది.
జీరో పొల్యూషన్ ఈ కారు ప్రత్యేకత. ఒక్క ఫిల్లింగ్ 600 నుంచి 800 కిలోమీటర్ల రేంజ్ మైలేజ్నిస్తుంది. గరిష్టంగా 7 నిమిషాల్లోనే ట్యాంక్ ఫుల్ అవుతుంది. అమెరికా, యూరప్, జపాన్, కొరియన్ కంట్రీస్లో ఇప్పటికే దూసుకుపోతున్న హైడ్రోజన్ ఎలక్ట్రిక్ వాహనాలు ఇండియాలో ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉన్నాయి. ఇవి మనకు అందుబాటులోకి రావాలంటే మరి కొన్నేళ్లు ఓపికపట్టాల్సిందే.


